Saturday, October 12, 2013

సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది


సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది. సరః అంటే సారము, స్వ అంటే తన యొక్క అని అర్దం. తన యొక్క సారాన్ని/తత్వాన్ని సంపూర్ణంగా తెలిపేది సరస్వతి.

మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.

కానీ నిజానికి మన తత్వం ఏమిటి? మనమేమిటి?....................... అని ఆలోచిస్తే ఎప్పుడు మనలో 'నేను' అనే తలంపు ఒకటి మెదులుతుంటుంది. ఈ దేహం పుట్టినప్పటి నుంచి మరణించేవరకు ఆ తలంపు మనల్ని వీడదు. ఆ 'నేను' అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు ధ్యానంలో విచారాణ ప్రారంభిస్తే, అది ఆఖరున ఆత్మలో లయమవుతుందంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మ మన సహజ స్థితి, నిత్యానంద స్థితి, ఆత్మయే మనం. ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆ ఆత్మయే మనం. ఆత్మకు పరిమితి లేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఈ లోకంలో ఆత్మ తప్ప మరొకటిలేదు.

ఈ ఆత్మ తత్వమే సనాతన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపింది. ప్రపంచంలో ఇతర మతాలు అశాశ్వతమైన ఈ శరీరం గురించి చెప్తే, మన ధర్మం సనాతనమైన ఆత్మ తత్వం గురించి ప్రపంచానికి చెప్పింది. మానవజన్మకు సార్ధకత/ నిర్యాణం/ మోక్షం లభించాలంటే ఆత్మ తత్వం అర్దమవ్వాలి. అటువంటి ఆత్మ తత్వం(మన తత్వం) గురించి మనకు సంపూర్ణంగా తెలియజేస్తుంది కనుక అమ్మను సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.

ఓం సరస్వత్యై నమః
 —

గోత్రము




గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.

ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...

సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే !

విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు. 

ప్రవర 

కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను. 

ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు

---------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత

---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ 

.........................శర్మన్ అహం భో అభివాదయే ||

అని పలకాలి

ప్రవర చెప్పునపుడు , లేచి నిలబడి , చెవులు చేతులతో ముట్టుకుని ఉండి , ( కుడి చేత్తో ఎడమ చెవి , ఎడమ చేత్తో కుడి చెవి .....కొందరు ఇంకోరకంగా ముట్టుకుంటారు ) , ప్రవర చెప్పి , వంగి భూమిని చేతులతో ముట్టి సాష్టాంగ నమస్కారము చేయవలెను .

పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి. 

సూత్రము 

ప్రవరలో మన సూత్రమేదో కూడా చెపుతాముకదా ..సూత్రమంటే ఏమిటి ?

యజ్ఞ యాగాదులు అనేక రకమైనవి ఉన్నాయి . ఉదాహరణకు , ’ దర్శ పూర్ణ మాస యాగము , అశ్వమేధ , పురుష మేధ మొ|| నవి . ఆయా యాగాదులలో ఇవ్వవలసిన ఆహుతులు ఏమిటి అన్న విషయాలు తెలిసిఉండవలెను . యజ్ఞ యాగాదులు మాత్రమే కాక , మనము చేయు శుభకార్యములన్నీ కూడా ఒక పద్దతిలో , సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తాము .

ఈ పద్దతులను , సాంప్రదాయాలనూ వివరించేవే సూత్రాలు . ఈ సూత్రాలను వివిధ మహర్షులు రాసియున్నారు . యజుర్వేదము పాటించేవారికి ’ ఆపస్తంబుడు ’ ’ బోధాయనుడు ’ సూత్రాలను రాసియున్నారు . ఋగ్వేదీయులకి ’ ఆశ్వలాయనుడు ’ రాశాడు .

బోధాయన సూత్రాలు చాలా వివరాలతో , ఎంతో నిడివితో కూడుకొని ఉంటాయి . బోధాయనుడి శిష్యుడైన ఆపస్తంబుడు , ఆ కాలానికే అవి నిడివి ఎక్కువ అని గ్రహించి , అనవసరమైన వాటిని కుదించి , ఎంత అవసరమో వాటిని మాత్రమే తిరగ రాశాడు . ఈనాడు యజుర్వేదము అనుసరించేవారిలో అధిక శాతము ఆపస్తంబుడి సూత్రాలనే ఎక్కువగా అనుసరిస్తారు . అయితే బోధాయన సూత్రాలను పాటించేవారుకూడా అనేకులున్నారు .

ఆపస్తంబుడు శ్రౌత , గృహ్య , ధర్మ మరియు శుల్బ సూత్రాలను రాశాడు . వీటన్నిటినీ కలిపి " కల్ప సూత్రాలు " అంటారు . మన వంశీయులు సాంప్రదాయకంగా పాటించే సూత్రాలను రాసినవారి పేరు కూడా ప్రవరలో చెప్పడము ఆనవాయితీ అయింది . ప్రవర అనేది ఒకమంత్రము కాదు . అది కేవలము మన పరిచయాన్ని చెప్పడము మాత్రమే .

( ఆపస్తంబుడి , 2650 B.C గురించి ఒక చిన్న ఆసక్తి కరమైన విశేషము ..ఆపస్తంబుడు అనునది అతని నిజమైన పేరుకాదు . అతడు ’ జల స్తంభన ’ విద్య నేర్చుకొని , నీటి అడుగున పద్మాసనములో రోజుల తరబడి కూర్చొని ధ్యానము చేసేవాడు. నీటిని నియంత్రించేవాడు కనక అతడిని ’ ఆపస్తంబుడు ’ అన్నారు . ( కొందరు ’ ఆపస్తంభుడు ’ అంటారు ) అతడు నీటిలో ఉండగా , చేపలు ఆకర్షించబడి అతని దగ్గర గుంపులు గుంపులుగా తిరుగుతుండేవి . జాలరులు అతడున్నది తెలియకనే , అక్కడికి వచ్చి చేపలు పట్టేవారు . ఒకసారి ఆపస్తంబుడు వలలో చిక్కుకొనగా , అతడిని జాలరులు " నాభాగుడు ’ అను రాజుగారి వద్దకు తీసుకొని పోతారు . రాజు అతడిని గౌరవించి , గోవులు సమర్పించి వదిలివేస్తాడు . )

హైందవ సంస్కృతి మాస పత్రిక ఆలయానికి వెళ్తున్నారా..? అయితే ఇవన్నీ తప్పనిసరి!

1. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
2. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
3. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
4. జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
5. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

6. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
7. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
8. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
9. దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
10. ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

11. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
12. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
13. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
14. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
15. ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

16. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
17. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
18. మూల విరాట్‌ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
19. ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.
20. ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.

21. గోపుర దర్శనం తప్పక చేయాలి.
22. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
23. ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
24. మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.