Friday, August 30, 2013

గానబంధు (లక్ష్మీదేవి వాహనం)

గానబంధు (లక్ష్మీదేవి వాహనం)

మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినపుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తుంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది? అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది.

ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూలశరీరాన్నివిడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటుచేసాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు. అయినా, తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అదితెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి.

కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గు పడుతున్న నారదుని చూచి అన్నాడు - 'నారదా! నీ కోపకారణం నాకు తెలియును. నిజానికి భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు తుంబరుడు నీకన్న కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికి వ్యర్థం. భక్తిశ్రద్ధలతో నన్నుకొలుచువారలకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత ననుజేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధ పడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించ వద్దు.'

నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. "ఓ దేవదేవా! నా తప్పులను క్షమించుము. అవివేకివలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికులవలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా!' అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాలమీద పడ్డాడు.

భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంధం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు.

శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చెతులు జోడించిన నారదుడు సెలవుపుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానససరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న 'గానబంధు' నారదుని చూడగానే వినయంతో ఆశనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశలప్రశ్నలు వేసాడు. ఏతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు.

నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం! తనకు కావలసింది సంగీతవిద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యంకాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసికొన్నారని, తనకూ అలాంటీ దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు, నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింప సాగాడు -

పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలి గుండెగలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తిగీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజబటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైనది రాజ్యబషిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. కాలచక్రం తిరగడం మానదుకదా! కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టినప్రాణి కూడ పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధజన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయింది. పురాకృత దోషఫలితం కాబోలు; ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరగలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూచి 'ధర్మరాజా! ఎందుకు ఈవిధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు?' అన్నాడు భువనేశుడు.

దివాంధ స్థితికి యమధర్మరాజు జాలి పడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది! అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు.

"దివాంధమా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసినమాట నిజమే. కాని పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా! ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తోంది. విష్ణుభక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయట పడటం ఎవరికీ సాధ్యం కాదు". సమవర్తి చెప్పింది విన్నాక గాని, దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలమీద పడ్డాడు.

యముని హృదయం కూడా ద్రవించింది. "ఉలూకరాజా! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది" అని దీవించి వెళ్ళాడు.

"ఓ మహర్షీ! ఆ దురదృష్టవంతుడను నేనే! ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా, దివ్య తేజస్వియైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, 'ఇది భువనేశుని కాయము వలెనున్నది. ఇందేల పడియున్నది? దీనిని యీ పక్షి భక్షించుటేమి?" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపైబడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకనుగుణంగా ఇలా పలికాడు. 'నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నాయెడల చూపిన కాఠిన్యం నేను ఆరోజునే మరచాను. నీవనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక! గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువు గాక!' అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవనలు ఫలించి నేనిట్లున్నాను" అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు.

ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని, తామసంతో కాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా వేయేళ్లు గడిచాయి. కఠోరమైనదీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును జేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను. ఏమికావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింప వద్దన్నాడు.

శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను! దివాంధమునకు వలసిన అవసరములేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీతకళతోపాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము' అని మనసులోని మాట బయట పెట్టాడు.

నారదుడు విశాలంగా నవ్వాడు. 'గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువు గాక!' అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకొన్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది
తత్తాదృజ్నత్మకం తవవపుస్సం ప్రాప్య సంపన్మయీ
సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి
తే నాస్యా బతకష్ట మచ్యుతవిభో త్వద్రూపమానోజ్ఞక
ప్రేమ స్థైర్యమయా దచాపలబాచ్చాపల్యవార్తాదభూత్

నారాయణునిపై అనురాగం పెల్లుబిక్కడం చేత లక్ష్మీదేవి తన భక్తుల వద్ద కూడా ఎక్కువ సేపు నిలబడదు. అందువలనే ఆమెకు చంచల అనే పేరు వచ్చింది. ఆమె అనురాగమే ఆమెకు ఆ అపకీర్తిని తెచ్చి పెట్టింది. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సదా నారాయణుని మనసులో నిలుపుకోవాలి. ఎప్పుడైతే నారాయణుడు మన మనస్సులో నివాసం ఉండడో...అప్పుడు లక్ష్మీదేవి కూడా మనలను విడిచిపెట్టి వెడుతుంది. కాబట్టి ఆ భగవంతుని సదా మనసులోనే నిలుపుకోవాలి.

లక్ష్మీదేవికి చంచల, చపల అనే పేర్లున్నాయి. ఒకచోట స్థిరంగా ఉండదని దీని భావం. ఎందరి జీవితానుభావాల్లో దీనికి నిదర్శనం. అయితే నిజానికి అమ్మవారి లక్షణం చాంచల్యం కాదు. మన కర్మాచరణకీ, బుద్ధికీ స్థిరత్వం లేకపోవడం చేత కర్మఫలప్రదాయిని జగదంబ అస్థిర ఫలాలను ప్రసాదిస్తోంది. అమ్మవారి సహజగుణం అనవతర నారాయణాశ్రయం. అంటే క్షణకాలం నారాయణుని విడవజాలనితనం. నారాయణుని అవతారాలన్నిటిలోనూ ఆమె ఏదో ఒక విధంగా ఆయనను ఆశ్రయించుకునే ఉంటోంది.

రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా లక్ష్మి నారాయణుని వెన్నంటే ఉంటోంది. ఇక్కడ మానవుల మానసిక ప్రవృత్తిలో తేడా వల్లనే లక్ష్మీదేవి మానవులకు చంచల స్వభావం కలదిగా కనపడుతోంది. మానవులు విద్య, ధనం కోసం భగవంతుని ఆరాధిస్తారు. దీనిని అనుగ్రహించి, నారాయణుడు మానవులకు సన్నిహితుడవుతాడు. ఆయనను వెన్నంటే లక్ష్మీదేవి భక్తుని చేరుకుంటుంది. తనకు కావలసినవన్నీ దక్కిన తర్వాత మనిషి భగవంతుడిని మర్చిపోతాడు. అలా నారాయణుడు భక్తునికి దూరమవుతాడు. అప్పుడు లక్ష్మీదేవి కూడా ఆ మనిషిని విడిచి వెళ్ళిపోతుంది.

Tuesday, August 27, 2013

శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు.

శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు.
ఈ మంత్రాలను జపిస్తే సుఖ-శాంతులతోపాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది. 


** శ్రీకృష్ణ భగవానుని మూల మంత్రం :
" కృం కృష్ణాయ నమః "

ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మనిషి అన్ని రకాల బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి. 

** " ऊँ శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా " 
ఈ మంత్రాన్ని సప్తదశాక్షర మహామంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. జపం చేస్తూ హోమం నిర్వహించాలి. ఇలాంటి సమయంలో దశాంశ అభిషేకం, తర్పణం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధిస్తుందో వారికి సర్వం లభిస్తుందంటున్నాయి పురాణాలు. 

** " గోవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని సప్తాక్షరాల మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని జపించే సాధకులకు అన్నిరకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి. 

** " గోకులనాథాయ నమః "
అష్టాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అతని కోరికలన్నీ ఫలిస్తాయి. 

** " క్లీం గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః "
ఈ దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని జపిస్తే అన్ని కోరికలు నెరవేరి అన్నిరకాల సిద్ధులు సిద్ధిస్తాయి.

** " ॐ నమో భగవతే శ్రీ గోవిందాయ "
దీనిని ద్వాదశాక్షర శ్రీ కృష్ణ మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఇష్టకామ్యార్థి సిద్ధిస్తుంది. 

** " ఐం క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వాగీశత్వం ప్రాప్తిస్తుంది. 

** " ॐ శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి బాధలు తొలగి శుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు.

** " ॐ నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి, వారు కోరుకున్న వస్తువులు లభిస్తాయి. 

** " లీలాదండ గోపీజనసంసక్తదోర్దండ బాలరూప మేఘశ్యామ భగవన్ విష్ణో స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక లక్షసార్లు జపిస్తూ నెయ్యి, చక్కెర మరియు తేనెలో నువ్వులు అక్షతలు కలిపి హోమం చేస్తుంటారో వారికి స్థిరమైన లక్ష్మి సిద్ధిస్తుంది. 

** " నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా "
ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ పాలు, చక్కెరతో చేసిన పాయసం ద్వారా హోమం చేస్తారో వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. 

** " ॐ కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞ త్వం ప్రసీద మే. రమారమణ విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే "
ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని రకాల విద్యలు నిస్సందేహంగా ప్రాప్తిస్తాయంటున్నారు పండితులు.

దేవతలకు – ప్రేతాత్మల మద్య ఉన్న దూరం చాలా స్వల్పం

మనిషిలో భావ శరీరానికి మనస్సుకు లింక్ ఏర్పడివుంది . అందువల్లనే మనస్సు కల్పించినట్లు స్పందనలు కలుగుతాయి.
కాని మానస శరీరం అందరికి ఏర్పడడం లేదు. మనస్సు పై ఆదిపత్యం ఏర్పడితే తప్ప మానస శరీరం ఏర్పడదు. అంటే అనాహత కేంద్రం చైతన్యం పొందితే తప్ప మానస శరీరం ఏర్పడినట్లు కాదు.
అనాహత కేంద్రం వరకు వెళ్ళిన వారు, నాల్గవ దైన మానస శరీరం పొందిన వారు ఇక్కడ మృతి చెందిన తరువాత దేవత లవుతారు. పైలోకాలలో దేవతలుగా అవతరిస్తారు.
మూడవ శరీరం వరకు సాధించిన వారు తిరిగి మనిషిగా జన్మించవలసి ఉంటుంది.
నాల్గవ శరీరం తర్వాతనే ఉత్తమ జన్మలు. మహర్లోక ప్రాప్తి. యోగంలో నాల్గవ శరీరం సాధించిన జీవి తిరిగి భౌతిక శరీరాన్ని కోరడు. మరొక జన్మకు రాదు. కాదంటే పైలోకాలకు వెళ్ళే అర్హత పొందేవరకు అరుప స్థితిలో ఉంటాడు.
రూప, ఆరూప స్థితులు రెండూ మానస శరీరం పరిదిలోనివే నని గమనించాలి.
మానస శరీరాన్ని అనుభూతి చెందినంత మాత్రాన సరిపోదు. స్పష్టంగా ఏర్పడాలి. స్పృహ, చైతన్యం అనేవి తోలిమెట్లు మాత్రమే. అవి నీడల వంటివి.
స్పృహ మాత్రమే మిగుల్చుకున్న వారు ప్రేతాత్మలుగా మారతారు. వీరినే నీచ దేవతలంటారు.
చైతన్యం పొందిన వారు దేవతలవుతారు. వారు ఉచ్చ దేవతలు. వీరి ఆవాసం స్వర్గలోకం. నీచ దేవతల నివాసం నరకలోకం. దేవతలకు, ప్రేతాత్మలకు ఉన్న దూరం చాల స్వల్పం.
ప్రేతాత్మలకు తెలియదు దేవతలూ తమవంటి వారే నని. శక్తి విషయంలో ఇరువురూ సమానమే. దేవతలు తమ ఆధిక్యత వల్ల, ఉన్నత లోకంలో ఉన్నందు వల్ల పూజింపబడుతున్నారు. ప్రేతాత్మలు నూన్యతాభావంతో వుంది, చెడ్డ పనులు చేస్తూ భయపెడుతుంటారు. ప్రేతాత్మలకు కొన్నింటికి ఆత్మజ్ఞానం ఉంటుంది. అలాంటివి మంచి పనులు చేస్తాయి. నాల్గవ శరీరం వరకు సాధించి చైతన్యం పొందితే మరణం తర్వాత దైవత్వం పొందగలరు.
స్వప్రజ్ఞ - దేవతలు, ప్రేతాత్మలు ఇవ్వరు!
అయిదవది ఆత్మ శరీరం. దీనిని సాధించిన జీవుడు దేవలోకాలు ధాటి సరాసరి ఊర్ద్వ లోకాలకు చేరతాడు.
అయిదవలోకంలో చైతన్యం, ప్రజ్ఞ కలగలసి ఉంటాయి. అంటే ఒక్కటై పోతాయి.
చైతన్యం పొందనిది, స్ఫూర్తి చెందనిది ఎవరూ ఆత్మ లోకాన్ని చేరలేరు.
చైతన్యం, ప్రజ్ఞ సమంగా ఏర్పడాలి. చైతన్యం కలగకపోయినా నాల్గవ భూమికను చేరవచ్చు, దేవుళ్ళు కావచ్చు. దేవతలై స్వర్గంలో తిష్ట వేయవచ్చు. చైతన్యంలో ప్రయాణం మలుపు తిరుగుతుంది. నాల్గవ మండలాన్ని చేరడం, దేవతలు కావడం జరుగుతుంది. ప్రజ్ఞ చైతన్యానికి తోడైతే ఆత్మ మండలం చేరగలరు. ఆత్మలకు ఆలంబనాలు చైతన్యం, ప్రజ్ఞ. అయిదవ మండలం తర్వాత రెండూ ఏకమై ఒక్కటిగా వుంటాయి.
నాల్గవ భూమిక వరకు నిద్ర వేరుగా, జాగృతి వేరుగా ఉంటుంది. ఆ తర్వాత నిద్ర, జాగృతి రెండూ చైతన్యంగా మారతాయి. ఈ చైతన్య ప్రజ్ఞ దేవుళ్ళు అనుగ్రహించేది కాదు. ప్రీతాత్మలు కనికరించి ఇచ్చేది కాదు. అది స్వప్రజ్ఞ.
దేవతలు కూడా పైలోకాలకు వెళ్ళాలంటే తిరిగి మానవ జన్మ ఎత్త వలసిందే!
ప్రేతాత్మలకు అయిదవ శరీరాన్ని ధరించే అర్హత ఉండదు. అసలవి ఆత్మ లోకంలో ప్రవేసించ లేవు. చైతన్యం నిలవడానికి అవసరమైన శరీరం వాటికి ఏర్పడదు. భౌతిక శరీరంతో ఉండగానే చైతన్యం పొందగలిగిన వారు ఆ స్థితికి చేరుకోగలరు. అప్పుడే జీవుడు సరాసరి ఆత్మలోకంలో ప్రవేశించి, చైతన్య ప్రజ్ఞను నింపుకుని ఆత్మ శారీరి కాగలడు.
దేవతలుగా మారి స్వర్గ సౌఖ్యాలు అనుభవించే వారైనా పైలోకాలకు వెళ్ళాలంటే తిరిగి మానవ జన్మ ఎత్తి , చైతన్య ప్రజ్ఞ సముపార్జించుకుని, ఆ ప్రజ్ఞతో మహార్లోకాలు చేరవలసి ఉంటుంది. అలా రెండవ సారి జన్మించినప్పుడు విస్మృతి ఉండదు. లక్ష్యం చెడదు. పూర్వజన్మ సంస్కారం ఉంటుంది. తన జీవిత గమ్యం ఇది అని ముందుగానే నిర్ణయించు కోవడం జరుగుతుంది. అలాంటివారు సుఖ దుఃఖాలకు అతీతంగా జీవిస్తూ కారణజన్ము లనిపించుకుంటారు.
సాధకులు స్వర్గంపై మోజు వదులుకోవాలి!
యోగి అయినవాడు బొత్తిగా ఆశించిదగినది కాదు స్వర్గం. భోగలాలసలు కోరేది స్వర్గం. అది అంత సుఖవంతమైనది కాదు. అక్కడ ఆనందం లభించదు. సుఖాలను తృప్తిగా మార్చుకుని అనుభూతించడానికి భౌతిక శరీరాలు, ఇంద్రియాలు ఉండవు. మహా స్తబ్దంగా bore గా ఉంటుంది. క్షణాల మీద కోరిన ప్రతి కోరిక తీరుతుంటే మజా ఏముంటుంది! నిరీక్షణలోనే కదా సుఖప్రాప్తి!
ఎంతకాలం స్వర్గంలో సుఖాలు అనుభవించినా ఎవరూ ఒక్కమెట్టు పైకి వెళ్ళే అవకాశం రాదు. అసలు పై లోకాలకు వెళ్ళే త్రోవ మూత పడుతుంది. ఆ సుఖలాలసలో పైలోకాలున్నాయని జ్ఞాపకం రాదు. మనిషిగా బ్రతికినంత కాలం స్వర్గాన్నైనా వాంచిస్తాడు. ఆ స్వర్గం చేరాక వాన్చిన్చవలసింది ఏమీ ఉండదు. మనిషిగా భూలోకంలో ఉన్నంత కాలం ఎన్ని సుఖాలు భోగాలు కోరినా, అనుభవిస్తున్నా విసుగు పుట్టాక పోవచ్చు. రోత కలగకపోవచ్చు. ఇక్కడ ఒక సుఖానికి మరో సుఖానికి మద్య విరామం ఉంటుంది. మనిషి వయస్సుతో పెర్గుదల, కోరికల తరుగుదల ఉంటుంది. స్వర్గంలో అలా కాదే! ఎల్ల కాలం నిత్య యవ్వనంతో ఉంటారేమో తూనీగల లాగా ముసురుతాయి కోరికలు, సుఖాలు. అక్కడి వారికి పుట్టడం, పెరగడం, మరణించడం లాంటివి ఉండవు. ఒకే యవ్వనంతో స్వర్గంలో అవతరించడం, విసుగు పుట్టినప్పుడు అంతర్ధానం కావడం. అంతే! ఎవరు ఎలా వస్తున్నారో, తిరిగి ఎక్కడికి పోతున్నారో అక్కడి వారికి తెలియదు. అసలు ఎవరూ పట్టించుకోరు. అన్ని భోగాలు అనుభవించినా ఒక్క రోజులో విసుగు పుడుతుంది. అసహ్యం వేస్తుంది. అందుకే దేవతలకు మనుషుల్ని చూస్తే అసూయ, వీరి పైన మోజు, ఎప్పుడు మానవ జన్మ ఎత్తుదామా, ఇలా బ్రతుకుదామా అనుకుంటారు. మనం వారి చర్యల్ని గమనించలేము గాని, వారు మన చర్యలని గమనిస్తుంటారు. మానవులపై మక్కువ కొద్దీ ప్రేమ కొద్దీ మనం అడిగిన వరాలు అనుగ్రహించి మంచి చేసుకుంటారు. సాధకులు మొదటనే స్వర్గంపై మోజు వదులుకోవాలి.

సాధకునికి తొలినుండి ఏర్పడవలసింది సత్య ద్రుష్టి, ఆత్మ జిజ్ఞాస. అటువంటి సాధకుడు అవాంతరాలను అలవోకగా దాటిపోగలడు. అతనికి సత్యం ఒక్కటే ధ్యేయంగా ఉంటుంది. చైతన్యం ఒక్కటే మార్గం అవుతుంది. ఆ లక్ష్యం చెదరనప్పుడు యోగి ఆత్మశరీరంతో ఆగిపోడు. ఆరంభంలోనే గమ్యం నిర్దేసిన్చుకుంటాడు కనుక, మధ్య ఏర్పడే అవాన్తరాలన్నీదాటిపోగాలుగుతాడు. చిన్న చిన్న ప్రలోభాలు తలెత్తినా సంయమనంతో వాటిని అణిచిపెట్టగలడు.

తులసి- జలంధరుడు

హిందువులకు తులసి పవిత్రమైనది. ఇది దేవతా ప్రీతికరము. పూజాద్రవ్యములలో ఒకటి. దీనిచేత ఇతర దేవతలను పూజిస్తారు. ఇది దివ్యౌషధము. శ్రీకృష్ణ భగవానుడు తరుచు తులసి వనమునందు విహరించుచుండెడివాడు. దీనియొక్క గాలి స్పర్శవలన దీర్ఘాయుర్దాయము కలుగుతుంది. ఎవరింట్లో తులసివనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్ధ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు.సర్వ పాప సంహారకమైన ఈ తులసివనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు.అనగా, నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం - ఈ మూడూ సమాన ఫలదాయకాలే. తులసిని ప్రతిష్టించినా, నీళ్ళు పోసినా, తాకినా సర్వ పాపాలూ నశిస్తాయి.
 

తులసి పుట్టుకకు పురాణ గాథను తెలుసుకుందాం.
కాలనేమి కూతురు బృంద. ఈమె చాలా అందగత్తె. రాక్షసరాజైన జలంధరునితో వివాహం జరిగింది. అనోన్య దాంపత్యము వీరిది. జలంధురుని గురువు రాక్షస గురువు అగు శుక్రుడు. అమృతపానం దేవతలు చేసినపుడు, రాహువుకూడా అమృతాన్ని తాగుతున్నప్పుడు రవి చంద్రులు చూసి విష్ణువునకు చెప్పడంవలన విష్ణు చక్రము చేత రాహువు తల ఖండించడం చేత, అప్పటికే అమృతము సేవించి యున్నందున రాహువు మృతము కానిది అమృతము కాబట్టి మృతి చెందని ఆ రాహువుయొక్క మొండెమునకు నాగుబాముతల అతికించాడా మహావిష్ణువు. అప్పటినుంచి సూర్య చంద్రులపై వైరి కలిగి యున్నాడు రాహువు. సూర్యచంద్ర గ్రహణములు ఈ రాహువలనే ఏర్పడుతుంటాయి. జలంధరుడు సముద్రుని పుత్రుడు లక్ష్మీదేవి యొక్క సోదరుడు. రాహువు యొక్క గాధను శుక్రునిద్వారా తెలుసుకొన్న జలంధరుడు, దేవతలపైకి దండెత్తి వారిని ఓడిపోయేలా చేస్తాడు.

దేవతలు అతన్ని జయించలేకపోవడానికి, కారణం పతివ్రత అయిన బృంద యేనని గ్రహిస్తారు . ఆ విషయం విష్ణువు కి తెలియజేస్తారు .

బృంద పాతివ్రత్యం చెడి పోతే గాని జలంధురుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణు ... జలంధురుని రూపం లో బృంద దగ్గరికి వెళ్తాడు , వచ్చించి భర్తేనని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది . దాంతో జలన్డురుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు . అది తెలిసి బృంద కోపం తో విష్ణువును శిలవు(రాయి) కమ్మని శపిస్తుంది .

అప్పుడు విష్ణుమూర్తి, తులసి పూర్వ జన్మ గాధను వినిపిస్తాడు. తులసి గోలోకములోనున్న గోపిక. ఆమె గోలోక కృష్ణు నకు పరిచారిక. పైగా కృష్ణునకు ప్రియురాలు కూడ. ఒక పర్యాయము తులసీ కృష్ణులు శృంగార రస పారవశ్యములో ఉన్నారు. అప్పుడు అనుకోకుండా రాధాదేవి అక్కడకు వచ్చింది. తులసీ కృష్ణుల శృంగార చేష్టితాన్ని చూసింది. కోపం పట్టలేక పోయింది. వెంటనే తులసితో, 'ఓసీ! నీవు నా స్వామితో కలిసి ఉన్నావు. ఇది ఎంతో సాహసకృత్యము. నాకే కష్టము కలిగింప నున్నావు. కనుక, ఈ రాక్షస కృత్యానికి అనుగుణంగా నీవు రాక్షస వంశంలో జన్మించు' అని శపించింది. ఆ శాపవాక్కులకు తులసి విపరీతంగా బాధపడింది. శ్రీకృష్ణ సాహచర్యం ఇక తనకుండదని వాపోయింది. తులసి యొక్క మనోవేదనను అర్థం చేసికొన్న గోపాలకృష్ణుడు, 'ప్రియా! తులసీ! చింతించకు. రాధాదేవి ఇచ్చిన శాపం మరలించడం సాధ్యం కాదు, కాని , నీవు రాక్షస వంశంలో జన్మించినా, నా అంశతో జన్మించిన వానికే భార్యవౌతావు, చివరికి నా అనుగ్రహం వల్ల, తిరిగి నన్ను చేరతావు, 'అని ఓదార్చాడు.విష్ణువు తన భక్తురాలైన బృందను అనుగ్రహించి ఆమె తులసి చెట్టు గా అవతరించి అన్ని లోకాల వారిచేత పూజలన్డుకుంటుందని వరమిచ్చి మోక్షం ప్రసాదిస్తాడు . ఆ విధం గా బృంద తులసి చెట్టు గా పూజలందుకొంటుంది .

దశభుజ, ముక్కంటి హనుమంతుడు

దశభుజ, ముక్కంటి హనుమంతుడు
దశభుజ, ముక్కంటి హనుమంతుడు
భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామి కీర్తికెక్కాడు. అలాగే సాధారణంగా మనం హనుమంతుని రాముని పాదాల వద్దో, సంజీవిని పర్వతాన్ని ఎత్తుకునో, రామలక్ష్మణులను తన భుజాలమీద ఎత్తుకుని ఆకాశంలో ఎగురుతున్నట్టుగానో దర్శనమిస్తారు. కానీ మూడు కళ్ళు, పది భుజాలు కలిగిన ఆంజనేయస్వామిని ఎప్పుడైనా చూసారా?
 
   ఆంజనేయస్వామి నుదురుపైన మూడో కన్నుతో, పది భుజాలతో మనకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళం పట్టణంలో ఉన్న ఆలయంలో భక్తుల పూజలందుకుంటూ దర్శనమిస్తారు. 
త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన తరువాత నారదుడు రాముణ్ణి దర్శించుకుని "రామా ... లంక నాశనముతో మీ యుద్ధము ముగియలేదు. రావణుని వారసులు ఇంకా ఉన్నారు, వారు మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాచుకుని వున్నారు. వారు ఇప్పుడు సముద్రం అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. మీరు వారి తపస్సు పూర్తీ కాకమునుపే వారిని సంహరించాలి'' అని వేడుకున్నాడు.
దానికి రాముడు "నారదా ... రామావతారంలో నా కర్తవ్యమ్ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలిస్తున్నాను కాబట్టి ఇంకెవరినైనా ఎంపికచేయండి'' అని బదులిచ్చాడు. రాక్షస సంహారానికి ఆంజనేయస్వామే తగినవాడని అందరూ నిర్ణయించడంతో విష్ణుమూర్తి తన శంఖుచక్రాలను, పరమశివుడు తన మూడో కంటిని, బ్రహ్మదేవుడు తన కమండలాన్ని ఇతర దేవతలనుంచి పది ఆయుధాలు పొంది హనుమంతుడు దశభుజుడయ్యాడు. పరమశివుని మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. హనుమంతుడు రాక్షస సంహారణానంతరం విజయంతో తిరిగి వచ్చి ఆనందమంగళం ప్రాంతంలో వెలిశాడు. భక్తులు ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారు. రాక్షస సంహారంతో ఆంజనేయుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.
సహస్రార చక్రము: (గర్భ గుడి)
జీవుడికి ఆధారమైన చక్రమిది. మస్తిష్కం (తలలోని మెదడు) పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు.. మెదడు పనిచేయకుంటే.. జీవుడు గాలిలో కలిసి పోయినట్లే. మస్తిష్కం.. జీవుడికే అంతటి కీలకమైనదైతే.. సమస్త జీవకోటిని సృష్టించి, పోషించే ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి..? మస్తిష్కం.. బ్రహ్మ రంధ్రానికి దిగువన వేయి రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని.. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమనీ, దేవీ భక్తులు.. దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

గర్భాలయం : శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో.. ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపమని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమ యోగులు.. స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది.


ఆజ్ఞా చక్రము: రెండోది ఆజ్ఞా చక్రం ఇది భ్రూ (కనుబొమల) మధ్య లో ఉంటుంది. ఈ చక్రము, రెండు రంగులతో కూడిన రెండు రేకులు (దళాలు) ఉండే కమలంలా ఉంటుందట. (ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే.)

విశుద్ధి చక్రము: (అంతరాలం)
మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం, తెల్లగా మెరిసిపోయే పదహారు రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం.
అంతరాలం : ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖ మంటపాన్నీ మహా మంటపాన్నీ కలిపే స్థానమే అంతరాలం.

అనాహత చక్రము: (అర్ధమంటపం)
ఇది హృదయ (రొమ్ము) స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని పన్నెండు రేకులు గల కమలంలా ఉంటుందిట. ఇది వాయుతత్వానికి ప్రతీక.
అర్ధమంటపం : గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది.

మణిపూరక చక్రము: (మహామంటపం)
నాభి (బొడ్డు) మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీల వర్ణంలోని పది దళాలు (రేకులు) కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్ని తత్వాన్ని ప్రతిఫలిస్తుంది.
ఆలయ నిర్మాణంలో... గొంతు నుంచి నాభి దిగువ దాకా మహా మంటపమే ఉంటుంది.

స్వాధిష్ఠాన చక్రము: (ధ్వజస్తంభం)
ఈ చక్రము లింగ (పురుషాంగం) మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల ఆరు దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ధ్వజస్తంభం : ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి, మహా మంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగ మొల వేలుపు అని శివుడికి పేరు. అంగ మొల అంటే, వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము అన్నా కూడా జెండా అని, మగ గురి అనీ అర్థాలున్నాయి. మగ గురి లో మగ అంటే.. మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగ (పుంసత్వపు) గురి అన్న అర్థముంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే.. వివాహాది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది.

మూలాధార చక్రము:
అన్ని నాడులకూ ఆధారమైన ఈ చక్రం గుద స్థానంలో ఉంటుంది. గుద స్థానానికి పైన, లింగ స్థానానికి కింద (గుద, లింగం రెంటి మధ్యలో) ఉంటుంది. ఎర్రటి రంగులోని నాలుగు దళాల కమలమిది. ఇందులోనే కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందట.

మోకాలి స్థానం : స్వామి వారి రెండు మోకాళ్లు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. (దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం) అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం.

పాదాలు : ఇది మహాప్రాకార గోపుర స్థానం. (ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా (పటిష్టంగా) అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్నినిర్మించే వాళ్లో.. గుడికీ, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే.. మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్లోకి వెళ్లగానే మన మనసు ప్రశాంతమై పోతుంది.

ఇదీ గుడి నిర్మాణం.. ఆ గుళ్లో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించిన సమాచారం. కాబట్టి, ఇకమీదట గుడికి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, స్వామిని మనస్పూర్తిగా ధ్యానించండి. భగవంతుడి ఆశీస్సులు పొందండి. సర్వే జనాస్సుఖినో భవంతు.

హనుమాన్ చరిత్ర


భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:) శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడుగా శ.రు.సం. (20-14, 37) స్పష్టం చేసింది.

అంతేకాదు, హనుమంతుణ్ని శివసుతుడుగా (మహాదేవత్మజ:) కూడా శ.రు.సం (20-32) వర్ణించింది. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, శివావతారుడుగా కీర్తిస్తారు. శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధ్రువీకరించింది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరంచాడని ఈ సంహిత చెబుతోంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడుకి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి, పుత్రుడికొసం తప్పస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజని తిన్న పహలితంగా ఆమె గర్భం దాల్చి, కాలక్రమంలో కుమారుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. వాయుప్రసాది కావడంచేత వాయునందనుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు.

దేవలోకంలొని పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి; వానరరాజైన కేసరి భార్య అయింది – వాల్మీకి రామాయణం (కిషిందకాండ 66-8). కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై, ఆమెను కౌగలించుకొన్నాడు. తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక, ఏకపత్నీ వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు – కి.కాం (66-16, 18,19) .

సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమినాడు బాలుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశంవైపు 300 యొజనాలు ఎగిరి సూర్యతేజస్సును ఆక్రమించుకొంటున్నాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది – కి.కాం. (66-24). అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద భావిసేతు నిర్మాణానికి కూడా హేతువైంది.

Monday, August 26, 2013

గణపతి లీలా వైభవం

గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"

"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించృ పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కదైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు.

మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించండి.

ఓం గం గణపతయే నమః

Sunday, August 25, 2013

తులసి :-


శ్రవణే చ, వ్యతీపాతే, భౌమ భార్గవ భానుషు,
పక్షద్వయాంతే, సంక్రాంతౌ, ద్వాదశ్యాం, సూతకద్వయే,
తులసీం ఏ విచిన్వంతి తే చిందంతి హరే శ్శిరః!!

ఆది, మంగళ, శుక్ర, వారాలలో, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య తిధులలో, జాతాశౌచ, మృతాశౌచాలలో, శ్రవణా నక్షత్రంలో, వ్యతీపాత యోగంలో, సంక్రాంతులలో, తులసీ దళాలు కోయగూడదు.తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!

తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.
తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!

తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.

భగవద్గీత....